ఎస్ఎస్సీ 2026లో రాష్ట్ర 2వ ర్యాంక్ సాధించిన లలితా కుమారిని సత్కరించిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం:
బంటుమిల్లి మండలం, మాట్లం గ్రామానికి చెందిన విద్యార్థిని అర్ధాని లలితా కుమారి ఎస్ఎస్సీ 2026 పరీక్షల్లో 598/600 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ పొందడం గర్వకారణమని మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఈ విశిష్ట విజయాన్ని సాధించిన లలితా కుమారిని, మచిలీపట్టణం నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తో కలిసి అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థినికి పుష్పగుచ్ఛం అందజేసి, ఆమె ప్రతిభను కొనియాడారు.
అలాగే, భవిష్యత్తులో ఎలాంటి విద్యను కొనసాగించాలనే విషయంపై సరైన మార్గదర్శనం అందిస్తామని, అవసరమైన సహకారం తనవంతుగా అందిస్తానని ఎంపీ బాలశౌరి హామీ ఇచ్చారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ తమ వంతు సహకారం కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాన్ని ఎంపీ అభినందించారు.

