హెల్మెట్ ధారణ – ప్రాణ రక్షణకు మొదటి అడుగు అంటూ ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం
మచిలీపట్నం:
బందరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నున్నా రాజు ఆధ్వర్యంలో మచిలీపట్నం నగరంలో హెల్మెట్ ధారణ మరియు రోడ్డు భద్రతపై ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాపాయాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని వివరించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు మాత్రమే కాకుండా వెనుక కూర్చునే వ్యక్తులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
అలాగే వాహనం నడుపుతూ సెల్ఫోన్ వినియోగించరాదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలియజేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అవగాహన కల్పించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను స్వచ్ఛందంగా పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి సహకరించాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ నున్నా రాజు మరియు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

