మచిలీపట్నం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి విజయలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎం నవీన్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా 22ఏ నిషేధిత భూములు, రీ-సర్వే పురోగతి, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ తదితర రెవెన్యూ అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ జిల్లాలో కొనసాగుతున్న రీ-సర్వే దశలు, గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్, రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి సంబంధించి తీసుకుంటున్న చర్యలను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు వివరించారు.
గ్రౌండ్ ట్రూతింగ్ నోటీసుల పంపిణీకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా నోటీసులు అందజేసే సమయంలో రైతులు అందుబాటులో లేకపోవడం వల్ల, గ్రౌండ్ ట్రూతింగ్ నిర్వహించే సమయంలోనే నోటీసులపై వారి సంతకాలు తీసుకుంటున్నామని వివరించారు. అయినప్పటికీ రైతులకు ముందస్తుగా సమాచారం అందించేందుకు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించడం, ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. ఈ-కేవైసీ విషయంలో కొంతమంది రైతులు ఇంకా అవగాహన పొందలేకపోవడం వల్ల ప్రక్రియ పూర్తిగా జరగడం లేదని తెలిపారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
జిల్లాల్లో రీ-సర్వే పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని, రైతులకు సంబంధించిన సేవలను సమర్థవంతంగా అందించాలని రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఇంచార్జ్ కలెక్టర్ కు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిల, బందరు ఆర్డిఓ కే సాంబశివరావు, సర్వే ఏడి కే లక్ష్మణరావు, కలెక్టరేట్ ఏవో రాధిక ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.