[addtoany]
మచిలీపట్నం :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుందని, విద్య వైద్య రంగాలకు బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయిస్తుందని, మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం మంత్రివర్యులు నగరంలోని ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు.
నగరంలో మంత్రి స్వయంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ఆసుపత్రిలోకి ప్రవేశించి అక్కడ అడ్డదిడ్డంగా ఉన్న వాహనాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే ఆసుపత్రి పర్యవేక్షకులను, పార్కింగ్ ఇన్చార్జి వారిని పిలిపించి ఇకపై వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఉంచకుండా ఒక నిర్దిష్టమైన పార్కింగ్ ప్రదేశంలో ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్ ప్రదేశంలో లేకపోతే ఆసుపత్రి బయటనే ఉంచేలా పర్యవేక్షించాలన్నారు.
అనంతరం మంత్రి ఆసుపత్రిలో అన్ని విభాగాలను తనిఖీ చేసి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. మరల ఆసుపత్రిని తనిఖీ చేస్తానని ఎక్కడ ఏ లోకం లేకుండా అన్ని ఏర్పాట్లు సరిగా చేయాలన్నారు. తేడా వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అడుగడుగునా రోగులను పరామర్శిస్తూ ప్రజలతో మమేకమై వైద్య సేవలు ఎలా ఉన్నాయి అని ఆరా తీశారు.
అక్కడి రోగులు వారి బంధువులతో ముఖాముఖి మాట్లాడి వైద్యం ఎలాగుంది మర్యాదగా ఉంటున్నారా లేదా వైద్యులు అందుబాటులో ఉంటున్నారా లేదా మందులు సరిగా ఇస్తున్నారా లేదా అని ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రివర్యులు ఆసుపత్రి పర్యవేక్షకులు, జనరల్ సర్జన్, సీనియర్ వైద్యులు, ప్రొఫెసర్లతో కలిసి కూర్చొని కాసేపు వారితో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఏ పరికరాలు ఉన్నాయి, ఏ పరికరాలు అవసరం ఉంది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తదనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రతిరోజు ఆసుపత్రికి 1600 మంది దాకా బయట నుండి రోగులు( ఓపి) వస్తున్నారని, ఇక్కడ 605 దాకా పడకలు ఉన్నాయని, ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా నడుస్తుందన్నారు. ప్రొఫెసర్లు, వైద్యులు అందరితో మాట్లాడామని వాళ్లు ఎవరైనా ఇతర ప్రాంతాల వారు అయితే తప్పనిసరిగా మచిలీపట్నంలో నివాసం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు
అలాగే స్టాఫ్ నర్సులు 90 మంది దాకా కొరత ఉందని వారిని త్వరలో నియమించాల్సి ఉందన్నారు
కొన్ని పరికరాల అవసరం ఉందని తన దృష్టికి వైద్యులు తీసుకొని వచ్చారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా బయట ప్రాంతాల నుండి వచ్చే వారికి ఓపి టోకన్లు జారీలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి మంగళవారం సదరం పరీక్షలు ఉండటం వలన సాధారణంగా వచ్చే రోగులకు అదనంగా సదరం పరీక్షలకు వచ్చే వ్యక్తులతో కొంత ఒత్తిడి కలుగుతున్నట్లు గమనించామన్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి ఆ రెండింటికి వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఒత్తిడిని తగ్గించాలని పర్యవేక్షకులకు సూచించామన్నారు. వారు డిఎంహెచ్వో తో మాట్లాడి డైట్ భవనంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నిరంతరం ప్రత్యేక శ్రద్ధతో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. వైద్యులు కూడా బాగా సేవలు అందిస్తున్నారన్నారనీ, ఆపరేషన్ అన్ని బాగా జరుగుతున్నాయన్నారు. అయితే ప్రజల్లో సంతృప్తి స్థాయి ఇంకా పెంచవలసిన అవసరం ఉందన్నారు.
వెంటిలేటర్ల అవసరం ఉందని పర్యవేక్షకులు చెప్పారని కొంత సి ఎస్ ఆర్ నిధులు, కొంత ప్రభుత్వ నిధులతో వాటిని సమకూర్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆసుపత్రిలో కొంత భద్రతా లోపం కూడా కనపడుతోందని ప్రధానంగా పార్కింగ్ సమస్య ఉందన్నారు. ఆసుపత్రికి వచ్చిన వారు ఎక్కడపడితే అక్కడ తమ వాహనాలను ఆసుపత్రిలో నిలుపుతున్నారని, ఇదివరకు పార్కింగ్ లో పెట్టే వారని ఇప్పుడు మరలా సమస్య వచ్చిందన్నారు.
ఇకపై ఆసుపత్రిలోకి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలన్నింటిని పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉంచాలని, లేకుంటే బయటే ఉంచాలని పర్యవేక్షకులకు స్పష్టం చేశామన్నారు. పారిశుధ్యం కూడా చాలా బాగుండాలని ఎక్కడైనా తేడా వస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్కు హెచ్చరించారు.
ఆసుపత్రిలో కొంత సిబ్బంది కొరత ఉందని అవసరం మేరకు త్వరలో నియామకం చేపడుతామన్నారు. ఆరోజున వైద్య కళాశాల వస్తే అన్ని రకాల చికిత్సలు అందుబాటులోకి వస్తాయని భావించామన్నారు. ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు కూడా మంజూరు అయ్యాయని, ఆసుపత్రిలో రోగులకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఈ పర్యటనలో మంత్రి వెంట ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ లీలా ప్రసాద్, ఆర్ ఎం ఓ నిరంజన్ కుమార్, సీనియర్ వైద్యులు డాక్టర్ శ్రీనివాసరావు, భగత్ సింగ్ నాయక్, ఎస్సీ విజిలెన్స్ కమిటీ సభ్యులు విద్యాసాగర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితర స్థానిక నాయకులు, పలువురు వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, రోగులు, వారి బంధువులు పాల్గొన్నారు.

