నేపాల్ వరదల్లో చిక్కుకున్న కృష్ణా జిల్లా వాసి ఆచూకీ కోసం చర్యలు – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం:
నేపాల్లో సంభవించిన వరదల కారణంగా మానస సరోవర్–కైలాస యాత్రకు వెళ్లిన కృష్ణా జిల్లాకు చెందిన చొప్పవరపు రమేష్ అక్కడ చిక్కుకున్నట్లు సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్ఓ చాంబర్ నుంచి మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ వివరాలు వెల్లడించారు. చొప్పవరపు రమేష్ కుటుంబ సభ్యులను జిల్లా యంత్రాంగం సంప్రదించి, వారి పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు.
రమేష్ ఆచూకీని త్వరితగతిన గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే నేపాల్ అధికారులతోనూ సమన్వయం చేసుకుంటూ రమేష్ ఆచూకీ కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఆయన ఆచూకీని గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించేలా చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.

