ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలి: కృష్ణా జిల్లా డిపిటిఓ కొడమంచిలి వెంకటేశ్వర్లు
మచిలీపట్నం:
కృష్ణా జిల్లా పరిధిలోని ఆర్టీసీ బస్సు సర్వీసులను నిర్ణీత సమయాలకు అనుగుణంగా నడుపుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి (DPTO) కొడమంచిలి వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. గురువారం మచిలీపట్నంలోని జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో జిల్లాలోని బస్సు డిపో మేనేజర్లు, ట్రాఫిక్, మెకానికల్ సూపర్వైజర్లతో ఆయన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిపిటిఓ మాట్లాడుతూ… “స్వర్ణ ఆంధ్రా – స్వచ్ఛ ఆంధ్రా” కార్యక్రమంలో భాగంగా బస్ స్టేషన్లలో పరిసరాల పరిశుభ్రత, టాయిలెట్ల నిర్వహణ, ప్రయాణికులకు తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెల 31వ తేదీలోగా SASA వెబ్సైట్లో సెల్ఫ్ అసెస్మెంట్ పూర్తి చేయాలని, సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు జరిగే కమిటీల పర్యవేక్షణకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
స్త్రీ శక్తి పథకంతో పెరిగిన రద్దీ
స్త్రీ శక్తి పథకం అమలు తర్వాత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగిందని, దీనికి అనుగుణంగా అన్ని రూట్లలోని బస్ స్టాప్ల వద్ద బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రయాణికులతో మర్యాదగా మెలగాలి
బస్ స్టేషన్లలో బెంచీలు, ఫ్యాన్లు తదితర మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించేలా డిపో మేనేజర్లు తగిన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.

