ఉత్పత్తిదారుల సంస్థలతో రైతులకు అధిక ఆదాయం: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం:
బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు గ్రామంలో శ్రీ విగ్నేశ్వర రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ వారు 35 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసుకున్న పసుపు,మిరప ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులందరూ ఐకమత్యంతో ముందుకు వచ్చి రైతుల ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం నుండి లబ్ధి పొందేందుకు చాలా పథకాలు ఉన్నాయన్నారు. ఇందుకోసం ఎవరైనా సంప్రదిస్తే ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ప్రోత్సహిస్తామన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ ప్రాంతంలో అమూల్ పాడి పరిశ్రమ ఎంతో పేరు గడిచిందన్నారు. అక్కడ ఎన్నో ఏళ్ల కిందటే పాలు పోసే రైతులు అందరూ కలిసి ఒక సంస్థగా ఏర్పడి సమిష్టిగా లాభాలు పొందుతున్నారన్నారు.

అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. రైతులకు వినియోగదారులకు మధ్య మధ్య దళారుల వ్యవస్థ ఉండడంతో రైతులు ఎప్పుడూ నష్టపోయేవారన్నారు. ఆ నష్టాలను అధిగమించే ఉద్దేశంతోనే అదనపు ఆదాయం పొందేందుకే రైతులందరూ కలిసి రైతు ఉత్పత్తిదారుల సంస్థను( ఎఫ్ పి ఓ లను) ఏర్పాటు చేసుకోవాలన్నారు. మధ్య దళారులు చేసే పనిని రైతు బృందం చేసుకుంటే వారికే అధనపు ఆదాయం లభిస్తుందన్నారు. ఆ ఆదాయాన్ని అందరూ సరి సమానంగా పంచుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం 35 లక్షల రూపాయల విలువతో పసుపు యూనిట్ ఏర్పాటు చేసుకున్నారని, అందులో ప్రభుత్వం 35% రాయితీ ఇస్తుందన్నారు. రైతు రాజుగా, పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే రైతు తాను పండించే పంటల అమ్మకం ధరలో అత్యధిక భాగం అతనికి దక్కితేనే సాధ్యమవుతుందన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనశాల సందర్శించి అక్కడే ఒంగోలు ఆవు, పొట్టేలు, ముర్ర జాతి గేదెలను పరిశీలించారు. తదుపరి కలెక్టర్ రైతులకు 5 కిలోల పశుగ్రాస విత్తనాల సంచులను 75 శాతం రాయితీ తో 115 రూపాయలకే పంపిణీ చేశారు. పొట్టేళ్ల పంపిణీ పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు ఒక్కొక్కరికి రెండు పొట్టేళ్లు చొప్పున ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డి ఆర్ డి ఏ పిడిని ఆదేశించారు.

తదనంతరం కలెక్టర్ మండలంలోని ధనమకూరు గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి తదుపరి వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ వినియోగాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజా, తహసిల్దారు కుసుమకుమారి, శ్రీ విఘ్నేశ్వర రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ అధినేత చంద్రమోహన్ రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

