గ్రంథాలయాలు డిజిటల్ నాలెడ్జి సెంటర్లు: చైర్మన్ బేగ్
మచిలీపట్నం:
జిల్లాలోని గ్రంథాలయాలను డిజిటల్ నాలెడ్జి సెంటర్లుగా తీర్చిదిద్ది పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం గ్రంథాలయ సంస్థ చైర్మన్ నగరంలోని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన 17 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలను కమిటీ చర్చించిన పిదప ఆమోదం నిమిత్తం ఆ ప్రతిపాదనలను పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుల వారికి పంపుటకు కమిటీ నిర్ణయం తీసుకుంది. శాఖా గ్రంధాలయ భవనాలకు రంగులు వెలిసిపోయినందున అవసరమగు గ్రంథాలయ భవనాలకు రంగులు వేసేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంది. బంటుమిల్లి గ్రామంలో శాఖ గ్రంథాలయ నిర్మాణం కోసం దాతలు కొమ్మారెడ్డి బ్రదర్స్ ఇచ్చిన స్థలం రిజిస్ట్రేషన్ కోసం ఒక లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు చేయుటకు కమిటీ తీర్మానించింది.
ప్రతి శాఖ గ్రంధాలయానికి రెండు సీసీ కెమెరాలు, ఒక కంప్యూటర్ సమకూర్చుకొనుటకు నిధులు కేటాయించేందుకు కమిటీ తీర్మానం చేసింది. గ్రంథాలయ సంస్థ పరిధిలోని శాఖా గ్రంధాలయాలలో డిజిటలైజేషన్లో భాగంగా కంప్యూటర్స్ నిర్వహించుటకు కంప్యూటర్ ఆపరేటర్ను, ఏర్పాటు చేయుటకు కమిటీ నిర్ణయం తీసుకుంది. శాఖా గ్రంధాలయాలను ఆధునికరించుట కోసం 5 లక్షల రూపాయల లోపు పనులకు సంస్థ తీర్మానంతో నామినేషన్ పద్ధతిపై జిల్లా స్థాయిలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సంస్థ పరిధిలోని శాఖ గ్రంథాలయాలకు ఆస్తి పన్ను తొలగింపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు కమిటీ తీర్మానం చేసింది. శాఖా గ్రంధాలయంలోని జీర్ణించిన, చదువుకు పనికిరాని పరీక్షల పుస్తకాలను తొలగించుటకు కమిటీ తీర్మానించింది. శాఖా గ్రంధాలయాలకు ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించుటకు సంబంధిత శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపాలని కమిటీ తీర్మానించింది..గ్రంథాలయ సంస్థ పరిధిలోని 19 శాఖా గ్రంధాలయాలకు ఒకటి నుండి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందజేయుటకు పాఠశాల విద్య శాఖకు ప్రతిపాదనలు పంపాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.
అనంతరం సంస్థ చైర్మన్ బేగ్ మాట్లాడుతూ తాను జిల్లాలోని 65 శాఖ గ్రంథాలయాలను పరిశీలించానని అన్ని కూడా దాదాపు నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో ప్రజలు విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా గ్రంథాలయాలను తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రానున్న రోజుల్లో గ్రంధాలయాల్లో కృత్రిమ మేధస్సు, స్టెమ్ ప్రోగ్రాము, అడ్వాన్స్ లర్నింగ్ వంటి అంశాలపై వివిధ కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు.
శిధిలావస్థలో ఉన్న ఎలమర్రు శాఖా గ్రంధాలయాన్ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించేందుకు ఒక కోటి రూపాయలు విరాళం ఇచ్చేందుకు ప్రవాస భారతీయులు ముందుకు వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. ఆ భవన నిర్మాణం త్వరలో చేపట్టి మరో తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఆర్టీసీ వారితో కూడా మాట్లాడి బస్ పాస్ కౌంటర్లను కూడా గ్రంధాలయాల్లో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తామన్నారు.
ఈ సమావేశంలో గ్రంధాలయ సంస్థ కార్యదర్శి రవికుమార్ వయోజన విద్య డిడి హాజీబేగ్, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి యమ్.వెంకటేశ్వర ప్రసాద్, విద్యాశాఖ ఏడి విద్యాలత, ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ డిసిఆర్బి అధికారి ఉమర్ అలీ, డి ఎల్ పి ఓ రజావుల్లా, ఎన్టీఆర్ జిల్లా డిపిఓ కార్యాలయం ఏవో రవికుమార్ అధికారులు పాల్గొన్నారు.

