ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలకు సన్మానాలు
మచిలీపట్నం :
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వారోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. “పిల్లల మధ్య ఎడం పాటిద్దాం.. ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం” అనే నినాదంతో ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ర్యాలీలు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
వారోత్సవాల ముగింపు సందర్భంగా పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ఒక గైనకాలజిస్టు, ఒక వేసెక్టమీ శస్త్రచికిత్స నిపుణుడు, ఒక ఏఎన్ఎం, ఒక మధ్యస్థాయి ఆరోగ్య సేవల అధికారి (ఎంఎల్హెచ్పీ), ఒక ఆశా కార్యకర్తను ఎంపిక చేసి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులను సంయుక్త కలెక్టర్ మల్లవరపు నవీన్ అందజేశారు.
అదేవిధంగా, ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలతో కుటుంబ నియంత్రణను పాటిస్తున్న దంపతులను, పిల్లల మధ్య విరామం కోసం ఐయూడీ వేయించుకున్న మహిళలను, కుటుంబ నియంత్రణలో భాగంగా వేసెక్టమీ చేయించుకున్న పురుషులను కూడా సన్మానించి ప్రశంసాపత్రాలు, నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. లోకానాథం దయాకర్, సంయుక్త కలెక్టర్ మల్లవరపు నవీన్, వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

