సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో ఘనంగా ఆర్ట్ ఎక్స్పో
మచిలీపట్నం:
విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించి, వారి ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో మచిలీపట్నంలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం ఆర్ట్ ఎక్స్పో–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ వినయ్ ప్రారంభించి విద్యార్థులు రూపొందించిన కళాఖండాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పుస్తక విద్యతో పాటు కళలు, సృజనాత్మక ఆలోచనలు కూడా విద్యార్థుల సమగ్ర వికాసానికి ఎంతో అవసరమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఆర్ట్ ఎక్స్పోలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పెయింటింగ్స్, డ్రాయింగ్స్, క్రాఫ్ట్ వస్తువులు, పర్యావరణ పరిరక్షణ, విజ్ఞానశాస్త్రం, సామాజిక అంశాలపై రూపొందించిన వివిధ కళాకృతులను ప్రదర్శించారు. విద్యార్థుల సృజనాత్మకత, రంగుల సమన్వయం, వినూత్న ఆలోచనలతో రూపొందించిన కళాఖండాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఇటువంటి సృజనాత్మక కార్యక్రమాలు విద్యార్థుల్లో కళాత్మక నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా, వారి ఆలోచనా సామర్థ్యం, ఊహాశక్తి, ఆవిష్కరణ దృక్పథాన్ని మరింత అభివృద్ధి చేస్తాయని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లిస్సమ్మ, ఉపాధ్యాయులు ప్రిసిల్లా, పావని, నిర్మల, కళ్యాణి, పిఈటి రాజేష్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.

