మచిలీపట్నం నుంచి కాకినాడ, అమలాపురం బస్సులను పునరుద్ధరించాలి: ఆర్టీసీ చైర్మన్ కొనకళ్లకు బీసీ సంక్షేమ సంఘం వినతి
మచిలీపట్నం:
మచిలీపట్నం నుంచి కాకినాడ, అమలాపురం ప్రాంతాలకు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులను తక్షణమే పునరుద్ధరించాలని బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా నాయకులు శనివారం ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గతంలో మచిలీపట్నం నుంచి బంటుమిల్లి, నరసాపురం మీదుగా అమలాపురం వెళ్లే బస్సు సర్వీస్ ప్రయాణికులకు, ఉద్యోగుల రాకపోకలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేదని గుర్తుచేశారు. అలాగే కాకినాడ సర్వీసును కూడా నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
వినతిపై ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీలోని పలు సమస్యలు తమ దృష్టిలో ఉన్నాయని, ప్రయాణికుల అసౌకర్యాన్ని తొలగించేందుకు కాకినాడ, అమలాపురం బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు గట్టిగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చైర్మన్ స్పందనకు సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జోగి శివ, నరిశెట్టి రత్తయ్య, నిక్కు రాధాకృష్ణ, మోకా నాగరాజు, కొండేటి మోహన్, భోగి రెడ్డి సుభాని, బి. ప్రసాద్, బెల్లంకొండ రవి, పెద్ది సాంబశివ, బి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

