మచిలీపట్నంలో 25న ‘5K రెడ్ రన్’ పరుగు
మచిలీపట్నం:
యువతలో హెచ్ఐవీ, ఎయిడ్స్ మరియు లైంగికంగా సంక్రమించే వ్యాధులపై పూర్తిస్థాయి అవగాహన పెంచేందుకు ఈ నెల 25న మచిలీపట్నంలో ‘5K రెడ్ రన్’ మారథాన్ నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం అధికారులు తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (DSA) సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో 17 నుంచి 25 ఏళ్ల వయస్సు గల విద్యార్థులు, యువతీ యువకులు పాల్గొనవచ్చని కృష్ణా జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టిబి అధికారి డాక్టర్ అంబటి వెంకట్రావు పేర్కొన్నారు.
ఈ పరుగు ఈ నెల 25న ఉదయం 6 గంటలకు చిలకలపూడి పాండురంగస్వామి ఆలయం వద్ద ప్రారంభమై నోబుల్ కాలేజీ వరకు సాగుతుందని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి కిరణ్ పందిటి వెల్లడించారు. పోటీలో పాల్గొనేవారు తప్పనిసరిగా ఏదైనా కళాశాలలో చదువుతూ ఉండాలని, రిజిస్ట్రేషన్ సమయంలో కాలేజీ గుర్తింపు కార్డు (ID Card) సమర్పించాలని సూచించారు. గత సంవత్సరం బహుమతులు పొందిన వారికి ఈసారి పాల్గొనే అవకాశం ఉండదు.
యువతీ యువకుల విభాగాల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ. 10,000, రెండవ బహుమతిగా రూ. 7,000 నగదు బహుమతులు అందజేస్తారు. ఇక్కడ ఎంపికైన విజేతలను తదుపరి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు. ఈ అవకాశాన్ని జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రిన్సిపాల్స్, వ్యాయామ విభాగాధిపతులు ప్రోత్సహించాలని కోరారు. ఇతర వివరాల కోసం అరుణను 9502030155 నంబర్లో సంప్రదించవచ్చు.

