పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్ డీకే బాలాజి
* ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సైకిల్పై హాజరై శ్రమదానం చేసిన కలెక్టర్
* పాత రైల్వే స్టేషన్ వద్ద నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమం
మచిలీపట్నం:
పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’, ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నగరంలోని పాత రైల్వే స్టేషన్ వద్ద గల నూతన మున్సిపల్ కార్యాలయ భవన ప్రాంగణంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు సందేశాన్ని ఇస్తూ కలెక్టర్ తన బంగ్లా నుంచి సైకిల్పై ఈ కార్యక్రమానికి తరలివచ్చి అధికారులతో కలిసి శ్రమదానం చేశారు. అనంతరం అందరిచేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటా తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా సహకరించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్.వి.వి.ఎస్. బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ కె. నాగరాజు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అడపా సుబ్రహ్మణ్యం, ఐడిపిఆర్ఓ పి. జయరావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, ఐసిడిఎస్ పిడి ఐ. విమల, కలెక్టరేట్ ఏవో రాధిక తదితర అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

