జర్నలిస్ట్ నందం రామారావు కుటుంబానికి ప్రముఖుల పరామర్శ
* కుమార్తె పద్మావతి అకాల మరణం పట్ల ప్రగాఢ సానుభూతి
* అండగా ఉంటామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, పేర్ని కిట్టు హామీ
మచిలీపట్నం:
ఆంధ్రప్రభ దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్, సీనియర్ జర్నలిస్ట్, నవలా రచయిత నందం రామారావును శనివారం పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల ఆయన కుమార్తె నందం పద్మావతి (48) ఆకస్మికంగా మృతి చెందడంతో తీవ్ర విషాదంలో ఉన్న రామారావు కుటుంబాన్ని కలిసి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), టీడీపీ నేత బత్తిన దాసు రామారావు నివాసానికి చేరుకుని, ఆయన అల్లుడు కుమ్మరిగుంట రమేష్, కుమారుడు నందం శ్రీనివాస్ (దూరదర్శన్)లను పరామర్శించారు. పద్మావతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.

అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), 1వ డివిజన్ ఇన్చార్జి జోగి చిరంజీవి, గాజుల భగవాన్లతో కలిసి రామారావు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని నాయకులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రభ ఆర్ఎం పి. హరిబాబు, బ్రాంచ్ మేనేజర్ కొండవీటి సురేష్, కృష్ణా బ్యూరో చీఫ్ అంగడాల రాంప్రసాద్, పలువురు జర్నలిస్టులు, స్థానిక ప్రముఖులు రామారావు కుటుంబాన్ని పరామర్శించారు. రామారావుతో ఉన్న సుదీర్ఘ జర్నలిజం, సాహిత్య అనుబంధాన్ని పలువురు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

