మచిలీపట్నంలో ఘనంగా ‘విశ్వకర్మ భగవాన్ జయంతి’ వేడుకలు
మచిలీపట్నం:
స్థానిక బంగారు కొట్ల లైన్, కన్యకా పరమేశ్వరి రైస్ మిల్ ఎదురుగా ‘శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం’ ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణా డి సి ఎం ఎస్ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ, గత 35 సంవత్సరాలుగా కులమతాలకు అతీతంగా విశ్వకర్మ భగవానుడికి పూజలు నిర్వహిస్తూ, వేలాది మందికి అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించారని తెలిపారు.
రాష్ట్ర స్వర్ణకార సంఘ కార్యదర్శి గడ్డంరాజు మాట్లాడుతూ, హిందూ పురాణాల ప్రకారం సృష్టికి మూలపురుషుడైన విశ్వకర్మ దేవతల దివ్య శిల్పి అని కొనియాడారు. సంఘ అధ్యక్షులు మానేపల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, మానేపల్లి ఈశ్వరచారి సిద్ధాంతి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు జరిపించి అన్నప్రసాద వితరణ చేశామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నగర పురప్రముఖులను శాలువాలతో సత్కరించి వేదాశీర్వచనం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కసుకుర్తి వీర వెంకటేశ్వరరావు, వాసాబత్తుల శ్రీనివాసరావు, అబ్దుల్ వాజిద్, మల్లికార్జునరావు, లోకేష్, రామారావు, నాగేశ్వరరావు, భవిరి అనిల్, గంగాధర్, రాజేంద్ర ప్రసాద్, వివిధ పార్టీల నాయకులు మరియు స్వర్ణకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

