ఖరీఫ్ నాటికి సాగునీటి కాలువల పనులు పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం :
జిల్లాలో వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి సాగునీటి, మురుగు కాలువల్లో తూడు, పిచ్చి మొక్కలు తొలగింపు, పూడికతీత, మరమ్మతు పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు.
బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో జలధార – జల హారతి కార్యక్రమం పురోగతి, అలాగే సాగునీటి కాలువల పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూగర్భ జలాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార – జల హారతి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో నీటి రీచార్జ్ షాఫ్ట్లను ఏర్పాటు చేయాలని, భూగర్భ జలమట్టం తక్కువగా ఉన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో గుర్తించి అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలంలో వచ్చే ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
సాగునీటి కాలువల పనులకు సంబంధించి మాట్లాడుతూ, గుర్రపు డెక్క, తూడు, పిచ్చి మొక్కల తొలగింపు, పూడికతీత, మరమ్మతు పనులను సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి పని రైతుల సమక్షంలోనే జరగాలని, పనులు పూర్తయ్యాక స్థానిక రైతుల నుంచి ధృవీకరణగా సంతకాలు తీసుకోవాలని ఆదేశించారు. తాను క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చినప్పుడు రైతులతో నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడతానని, పనులు జరగలేదని రైతులు చెబితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
సమావేశంలో జలవనరుల శాఖ ఎస్ఈ గుణకర్, డ్వామా పీడీ ఎన్ శివప్రసాద్ యాదవ్, కేసి డివిజన్ ఈఈ రవి కిరణ్, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

