విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి
మచిలీపట్నం:
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా గురువారం మచిలీపట్నం జిల్లా కలెక్టరేట్లోని విసి హాల్లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే. చంద్రశేఖర రావుతో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరంలో అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన దేశభక్తి, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అధికారులు పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, యువత వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని తెలిపారు.

