పెడన కలంకారీ పరిశ్రమలో ప్రమాదకర రసాయనాల వాడకంపై విచారణకు ఉత్తర్వులు
విజయవాడ:
కృష్ణా జిల్లా పెడన కలంకారీ పరిశ్రమలో రంగుల తయారీ కోసం క్యాన్సర్ కారకమైన ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తున్నారనే ఫిర్యాదుపై రాష్ట్ర లోకాయుక్త తీవ్రంగా స్పందించింది. గౌరవ లోకాయుక్త జస్టిస్ పి. రజని ఆదేశాల మేరకు పర్యావరణ మరియు అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీకాంత్లాల్ దండే విచారణకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (APPCB) మెంబర్ సెక్రటరీ శరవణన్ (ఐ.ఎఫ్.ఎస్.) ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపాలని ఆదేశించారు (గౌరవ లోకాయుక్త కేసు నెం. 1884/2026/బి1).
యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ. క్యాంపైన్ ప్రతినిధులు, ఆర్.టి.ఐ. కార్యకర్తలు జంపాన శ్రీనివాసగౌడ్, బేతపూడి జోగేశ్వరరావు, శిరివెళ్ల గౌరి జూన్ 20, 2026న రాష్ట్ర లోకాయుక్తకు సమర్పించిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. పెడన మున్సిపాలిటీ పరిధిలోని కలంకారీ పరిశ్రమపై ఆధారపడి దేవాంగులు, పద్మశాలి వర్గాలకు చెందిన సుమారు 15 వేల మంది వెనుకబడిన తరగతుల ప్రజలు జీవనం సాగిస్తున్నారు.
నియమాల ప్రకారం కలంకారీ వస్త్రాల తయారీకి సహజ సిద్ధమైన రంగులనే వాడాల్సి ఉండగా, 15 నుండి 20 శాతం మంది క్యాన్సర్ కారకమైన ప్రమాదకర రసాయన రంగులను వినియోగిస్తున్నారు. దీనివల్ల పెడన పరిసర గ్రామాలలోని రామరాజు కాలువ, బుద్ధాలపాలెం కాలువల నీరు తీవ్రంగా కలుషితమవుతోందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. కాలుష్యానికి కారణమవుతున్న కలంకారీ పరిశ్రమ యాజమానులపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

