[addtoany]
మచిలీపట్నం :
రైతులు యూరియా వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించి అధిక ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.
బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ పామర్రు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ పామర్రు మండలంలోని పెదమద్దాలి గ్రామం సందర్శించి రైతన్న మీకోసం కార్యక్రమం లో భాగంగా రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం బుడమేరు వరదల కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించామని, ఒకవైపు రసాయనిక ఎరువులు వేసిన వరి పొలం, దాని పక్కనే ప్రకృతి వ్యవసాయంతో సాగుచేసిన వరి పొలం గమనించామని, మొదట్లో రెండింటిలోనూ నాలుగైదు రోజులు వరద నీరు నిలిచి ఉందని, ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయంతో సాగుచేసిన వరి పంట నిటారుగా నిలిచిందని మంచి దిగుబడి వచ్చిందన్నారు. రసాయన ఎరువులతో సాగుచేసిన వరి పంట దిగుబడి లేక రైతు నష్టపోయారన్నారు.
వరి నాట్లు వేసే ముందు రైతులు ముందస్తుగా( పిఎండిఎస్ ) ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనగా వర్షాకాలం రాకమునుపే 32 రకాల విత్తనాలతో తయారుచేసిన విత్తనాల బంతులను (సీడ్ బాల్స్) పొలంలో వెదజల్లి , ఆ తర్వాత వరి పంట సాగు చేయాలని అలా రెండు మూడు పంట కాలాలు తప్పనిసరిగా పాటిస్తే రైతులకు మంచి దిగుబడి ఆదాయం లభిస్తుంది అన్నారు. రైతులందరూ రాను రాను యూరియా వాడకం మోతాదు పెంచుతున్నారన్నారు. అలా చేయడం వల్ల నేలలో సారం తగ్గిపోతుందన్నారు. ఇకనైనా యూరియా వాడకం రాను రాను తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని కోరారు. తద్వారా నేల బలోపేతం అవుతుందన్నారు. పంట దిగుబడులు బాగా రావాలంటే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 5 సూత్రాలను విధిగా పాటించాలన్నారు
గ్రామంలో కూలీల సమస్య ఉందని రైతులు కలెక్టర్కు చెప్పగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ అవసరమైతే వారికి డ్రోన్లు పంపిస్తామని వాటిని వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా రైతులు గ్రామంలో మురికి కాలువ లేదని, వర్షం వచ్చినప్పుడు మురికి నీరు ప్రవహించకపోవడంతో పిల్లలను పాఠశాలకు తీసుకొని వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా ఆయన వెంటనే స్పందిస్తూ కచ్చా మురికినీటి కాలువను ఏర్పాటు చేయాలని డిప్యూటీ ఎంపీడీవో గంగాధర్ రావు, పంచాయతీ కార్యదర్శి కి సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఇటలీ కి చెందిన కేర్ టు యాక్షన్ స్వచ్ఛంద సంస్థ సమకూర్చిన నిధులతో పునరుద్ధరించిన అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి చిన్నారులతో కలెక్టర్ మాట్లాడుతూ వారి పేర్లను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం చుట్టూ పరిసర వాతావరణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
తదుపరి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తోమాసా ఖరారో, ఆందోనియా, దొరియోలు జిల్లా కలెక్టర్కు మర్యాదపూర్వకంగా మొక్కను అందజేయగా, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వారినీ కలవడం చాలా సంతోషంగా ఉందని అంగన్వాడీ కేంద్రాలకు సహకారం అందిస్తున్నందుకు అభినందిస్తున్నానన్నారు. రానున్న రోజుల్లో పామర్రు మండలంలో 70% పనులు పూర్తయిన 18 మినీ అంగన్వాడీల నిర్మాణం పూర్తి చేయుటకు సహకారం అందించాలని కోరడంతో అందులకు వారు సమ్మతించారు.
తదనంతరం జిల్లా కలెక్టర్ పామర్రు లోని చాట్లవాణిపురం సందర్శించి అక్కడ మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని, ప్రణాళిక చిత్రపటాన్ని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ పామర్రు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఏమైన అవాంఛనీయ సంఘటనలు జరిగాయా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయా లేదా అని పరీక్షా కేంద్రం ముఖ్య పర్యవేక్షకులు స్వరాజ్యలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షకు 174 మంది విద్యార్థులు హాజరయ్యారని అంతా ప్రశాంతంగా జరుగుతోందని పర్యవేక్షకులు కలెక్టర్కు వివరించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఉయ్యూరు ఆర్డిఓ శ్రీదేవి, ఐసిడిఎస్ పి డి ఎం ఎన్ రాణి, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ ఈ రాజన్న తహసిల్దారు రవికాంత్, డిప్యూటీ ఎంపీడీవో గంగాధర్ రావు, మండల వ్యవసాయ అధికారి నాగరాణి, ఏఈ రాజేష్, వసతి గృహం సంక్షేమ అధికారి వీణకుమారి, కేర్ టు యాక్షన్ డైరెక్టర్ అడ్వైజర్లు వెంకటస్వామి అడ్వైజర్ కళామణి, విఏఏ శేఖర్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు కోమలి తదితర అధికారులు పాల్గొన్నారు.

