మడ అడవులు ఆక్రమించి చెరువులు తవ్విన వారిపై చర్యలు తీసుకోండి: సీనియర్ అడ్వకేట్ జి.వి.రమణ
మచిలీపట్నం:
మడ అడవులు ఆక్రమించి చెరువులు తవ్విన వారిపై చర్యలు తీసుకోవాలని సీనియర్ అడ్వకేట్ జివి రమణ కోరారు. జివి రమణ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సముద్ర గర్భం నానాటికి కుంచించుకుపోతోందని, మడ అడవులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర తీరo వెంబడి గ్రామాల ప్రజల రక్షణ దినదిన గండంగా మారుతోందన్నారు. కొందరి స్వార్థపరుల దురాక్రమణ, భూ కబ్జాదార్ల మితిమీరిన భూదాహం, అక్రమార్జన, స్వార్థ రాజకీయపరుల స్వలాభము,అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వంటి కారణంగానే సముద్ర తీరం వెంబడి ప్రభుత్వ, పంచాయితీ ఫారెస్ట్, అసైన్డ్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఇలాకాలోనే చట్టాల ఉల్లంఘన పర్యావరణ విఘాత చర్యలు, భూకబ్జాలు చోటు చేసుకోవడం జరుగుతోంది.
బందరు రూరల్ మండలం, పెదపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని 181, 182/1,182/2,155/A155/B లలో సుమారు 40 ఎకరాల గ్రామపంచాయతీ ఆస్వాదిన అసైన్డ్, దిబ్బ, ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయి. ఆక్రమణదారులు సముద్రానికి రక్షణగా ఉన్న మడ అడవులు నరికివేసి ఆ భూముల్లో చెరువులు తవ్వారని అన్నారు. ఆక్రమణదారులు ఆ ప్రాంతంలో తమకున్న 16 సెంట్లు భూమిని చూపుతూ ఈ భూకబ్జాకు పాల్పడినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పాతర వేసి నిబంధనలకు విరుద్ధం గా ప్రవర్తించారన్నారు.

పెదపట్నం గ్రామంలో యదేచ్ఛగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పాతరేస్తున్నారన్నారు .సి ఆర్ జెడ్ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారన్నారు. సి ఆర్ జెడ్ జోన్ వన్ నిబంధన ప్రకారం సముద్రానికి 500 మీటర్ల లోపు ఎలాంటి ఆక్రములకు పాల్పడకూడదు. మడ అడవులు నరకడం, భూముల ఆక్రమించి చెరువులు తవ్వడం, పర్యావరణానికి విఘాతం కలిగించడం, వన్యప్రాణులకి నష్టం కలిగించే చర్యలు చేపట్టడం చట్టరీత్యా నేరం అన్నారు. ఇవేమీ పట్టకుండా బంటుమిల్లి కి చెందిన ఓ న్యాయవాది పట్టపగలే మడ అడవులు నరికి చెరువులు తవ్వి భూ కబ్జాకు పాల్పడి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు సవాల్ విసిరారని జీవీ రమణ ఆరోపించారు. ఆక్రమణలతో సముద్రం ఘోషిస్తున్న అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు.
జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
పెదపట్నంలో భూముల ఆక్రమణ, మడ అడవులు నరికి చెరువులు తవ్విన ఘటనపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు అందింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సి ఆర్ జెడ్ జోన్ వన్ నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు అండదండలతో 40 ఎకరాలు ఆక్రమించారని మచిలీపట్నానికి చెందిన న్యాయవాది జీవీ రమణ జిల్లా కలెక్టర్ బాలాజీ ని కలిసి ఫిర్యాదు అందజేశారు. అంగర రంగనాథ్, అంగర రామ్మోహన్ రావు, అంగర వెంకట నవీన, అంగర రమాదేవి, అంగర రజిని, అంగర అరుణ్ కుమార్ లు ఈ ఆక్రమణకు పాల్పడి మడ అడవులు నరికి చెరువులు తవ్వారని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

