మచిలీపట్నం :
జిల్లాలో సంభవిస్తున్న రహదారి ప్రమాదాలను సమర్థవంతంగా తగ్గించేందుకు, ముందస్తు చర్యలలో భాగంగా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు మచిలీపట్నం నుండి పెనమలూరు వరకు గల జాతీయ రహదారి పైన ప్రమాదాలకు గురయ్యే అవకాశమున్న ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్)ను ప్రత్యక్షంగా సందర్శించి సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలను, ప్రమాదాలకు దారితీసే ముఖ్య కారణాలను సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రహదారుల నిర్మాణ పరిస్థితులు, వంకరలు (బ్లైండ్ కర్వ్స్), గుంతలు, తగినంత సైన్ బోర్డుల లేమి, రాత్రి వేళల్లో లైటింగ్ లోపం వంటి అంశాలు అన్నింటిని పరిశీలించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని, సంబంధిత అధికారులకు తక్షణం మరియు దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు.
ప్రత్యేకంగా, ప్రమాదాలు అధికంగా సంభవించే ప్రాంతాలను అధికారికంగా “బ్లాక్ స్పాట్స్”గా గుర్తించి, అక్కడ హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ సిగ్నేజీ, స్పీడ్ లిమిట్ సూచనలు, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రాత్రి వేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా హై విజిబిలిటీ సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్స్ తో కూడిన డ్రమ్ములు భారీ గేట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
అదేవిధంగా, వాహనదారులలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడం అత్యంత కీలకమని పేర్కొంటూ, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం వంటి నియమాలను కఠినంగా అమలు చేయాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు. ప్రజల సహకారం లేకుండా రహదారి భద్రత సాధ్యం కాదని, అందువల్ల సామాజిక అవగాహన కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని తెలిపారు.
ఈ సందర్భంగా సంబంధిత పోలీసు అధికారులు, రోడ్డు రవాణా శాఖ, ఆర్ & బి విభాగం అధికారులు పరస్పర సమన్వయంతో పని చేసి, గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద వెంటనే సవరింపు చర్యలు చేపట్టి, భవిష్యత్తులో ప్రమాదాలను గణనీయంగా తగ్గించే దిశగా కృషి చేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఇకపై కూడా బ్లాక్ స్పాట్స్పై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, తరచూ తనిఖీలు నిర్వహించి, పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.