కృష్ణా విశ్వవిద్యాలయంలో మాదకద్రవ్య రహిత అవగాహనా కార్యక్రమం
మచిలీపట్నం:
కృష్ణా యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మై భారత్ అనుసంధానంలో శుక్రవారం నాడు నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ పేరుతో మాదకద్రవ్యాలు వాడక నిషేధం, వాడకం వల్ల జరిగే పర్యవసానాల మీద అవగాహనా సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయిన కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్ వరలక్ష్మి మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారిని సమాజంలో నుండి వెలివేసేందుకు నేటి యువత ముందుకొచ్చి పోరాడాలన్నారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె రాంజీ మాట్లాడుతూ కృష్ణా విశ్వవిద్యాలయంలో యువత ఎటువంటి వ్యసనాల జోలికి పోకుండా భవిష్యత్తు మీద దృష్టి సారించి ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన మెలకువలు నేర్చుకుంటూ జీవితంలో పైకి ఎదిగే క్రమాన్ని అలవర్చుకోవాలన్నారు. మచిలీపట్నం డి.ఎస్.పి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మాదకద్రవ్యాలను నియంత్రించడంలో మా వంతు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నామనీ దాన్ని మరింతగా అమలు పరచడంలో విద్యార్థుల సహకారం ఎంతో అవసరమని అన్నారు.
వర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రావణి సమన్వయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ పేట సీఐ ఏసుబాబు, ఎన్టీఆర్ జిల్లా యువజన అధికారి బి ప్రదీప్ కుమార్, సీనియర్ అడ్వకేట్ సిహెచ్ ముసలయ్య, వర్సిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం కోటేశ్వరరావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఆర్ కిరణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు

