మచిలీపట్నం :
కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ( కేడీసీసీ) సేవల నాణ్యతలో విశేష ప్రగతి సాధిస్తూ మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకుంది. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డిజేషన్ (ఐఎస్ఓ ) నుంచి ISO 9001:2015 సర్టిఫికేషన్ పొందడం ద్వారా బ్యాంక్ తన నాణ్యతా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టుకుంది. ఈ సర్టిఫికేషన్ను శనివారం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాకుండా, బ్యాంక్లో అమలు చేస్తున్న వ్యవస్థలు, పారదర్శకత, సేవల ప్రమాణాలు, వినియోగదారుల సంతృప్తికి ప్రపంచ స్థాయి ముద్ర అని పేర్కొన్నారు. ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ సాధించడం మా బ్యాంక్కు గర్వకారణం. ఇది మా సేవల నాణ్యతకు అంతర్జాతీయ గుర్తింపు. రైతులు, ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందించాలనే మా నిబద్ధతకు ఇది ప్రతిఫలం అని నెట్టెం రఘురాం తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గ దర్శకత్వంలో సహకార రంగాన్ని ఆధునీకరించడంలో కే డి సి సి బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని పిఎసిఎస్ లను డిజిటల్ వ్యవస్థలతో అనుసంధానం చేసి, యూపీఐ, ఫోన్ పే వంటి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వన్ టైమ్ సెటిల్మెంట్ ( ఓ టి ఎస్) ద్వారా వడ్డీ మాఫీ వంటి పథకాలను అమలు చేసి వేలాది మంది రైతులకు ఉపశమనం కల్పించామని వివరించారు. ఐఎస్ఓ సర్టిఫికేషన్ సాధించడం ద్వారా కే డి సి సి బ్యాంక్ రాష్ట్రంలోనే కాకుండా దేశ స్థాయిలోనూ సహకార బ్యాంకింగ్ రంగానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో మొట్టమొదటిగా ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్ పొందడం ఒక విశేష ఘట్టమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రమాణాలతో సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని చైర్మన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈవో శ్యామనోహర్, ఐఎస్ఓ ప్రతినిధులు పాల్గొన్నారు.