కానూరు పీఏసీఎస్లో వైభవంగా మహాజన సభ: 459 మంది రైతులకు రూ.5.36 లక్షల వడ్డీ రాయితీ పంపిణీ
మచిలీపట్నం:
కానూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆవరణలో సోమవారం మహాజన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సహకార సంఘం పరిధిలోని 459 మంది రైతులకు 3 శాతం వడ్డీ రాయితీ కింద మంజూరైన రూ.5,36,780 లబ్ధి చేకూరే చెక్కును ముఖ్య అతిథి గోపు సత్యనారాయణ రైతు ప్రతినిధులకు అందజేశారు. అనంతరం రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు. ఈ సందర్భంగా సంఘం నూతన భవన నిర్మాణం, 2025–26 ఆర్థిక సంవత్సర లాభనష్టాల సమీక్ష, వాయిదా మీరిన బకాయిల వసూళ్లు మరియు వాటిపై తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై విస్తృతంగా చర్చించారు. సభలో పలువురు రైతులకు కౌలు కార్డులను పంపిణీ చేశారు.
సొసైటీ అధ్యక్షుడు గోపు ప్రతాప్ నరేష్ కుమార్ మాట్లాడుతూ, తాము బాధ్యతలు స్వీకరించిన 13 నెలల కాలంలో 50 మంది రైతులకు రూ.2.50 కోట్ల విలువైన కొత్త రుణాలను అందజేశామని తెలిపారు. అలాగే దీర్ఘకాలిక బకాయిల కింద 16 మంది రైతుల నుంచి రూ.6.70 లక్షలు వసూలు చేసినట్లు వివరించారు. రైతులకు అవసరమైన అన్ని రకాల రుణ సదుపాయాలు కల్పిస్తూ, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు దివి మహేష్, చెక్కా నాగరాజు, కార్యదర్శి అడపా శ్రీనివాసరావు, విఆర్ఓ చలమలశెట్టి దాసు, విఏఏ కే.స్వామితో పాటు సుమారు 150 మంది పీఏసీఎస్ సభ్యులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

