జులై 1, జాతీయ వైద్యుల దినోత్సవం
భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1న “జాతీయ వైద్యుల దినోత్సవం”(డాక్టర్స్ డే) జరుపుకుంటారు. సమాజ ఆరోగ్య రక్షణలో రాత్రింబవళ్లు శ్రమిస్తూ, ప్రాణాలను కాపాడే వైద్యుల సేవలను గుర్తించడానికి మరియు వారికి కృతజ్ఞతలు తెలపడానికి ఈ రోజును కేటాయించారు. సమాజంలో వైద్యులు అందించే నిరంతర సేవలను, ముఖ్యంగా అత్యవసర సమయాల్లో (మహమ్మారుల వంటి విపత్కర పరిస్థితుల్లో) వారు చేసే ప్రాణత్యాగాలను స్మరించుకోవడం, రోగులు మరియు వైద్యుల మధ్య నమ్మకాన్ని, ఆరోగ్యకరమైన సంబంధాన్ని పెంపొందించడం ఈ జాతీయ వైద్యుల దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.
భారతదేశంలో డాక్టర్స్ డేని ప్రముఖ వైద్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు మరియు పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి మరియు వర్ధంతి సందర్భంగా జరుపుకుంటారు. జూలై 1, 1882న జన్మించిన రాయ్ సరిగ్గా అదే రోజున అంటే జూలై 1, 1962న మరణించారు. వైద్య రంగంలో ఆయన చేసిన అసమాన సేవలకు గాను 1961లో దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ లభించింది. భారత ప్రభుత్వం 1991 లో డాక్టర్ బి.సి. రాయ్ సేవలకు నివాళిగా ప్రతి ఏటా జూలై 1వ తేదీని “జాతీయ వైద్యుల దినోత్సవం” గా ప్రకటించింది.
డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ భారతదేశం కన్న గొప్ప మేధావులలో ఒకరు. ఆయన కేవలం ఒక వైద్యుడు మాత్రమే కాదు… స్వాతంత్య్ర సమరయోధుడు, గొప్ప విద్యావేత్త, సామాజిక సంస్కర్త మరియు పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి. ఆయన జీవితం, దేశానికి ఆయన చేసిన సేవలు నిజంగా స్ఫూర్తిదాయకం.
జననం మరియు మరణం ఒకే రోజు
డాక్టర్ బి.సి. రాయ్ జీవితంలో ఒక అరుదైన కాకతాళీయం ఉంది. ఆయన జూలై 1, 1882న జన్మించారు. 80 సంవత్సరాల పాటు దేశానికి సేవలందించి, సరిగ్గా తన పుట్టిన రోజైన జూలై 1, 1962న కన్నుమూశారు. ఆయన జ్ఞాపకార్థమే ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీని మనం “జాతీయ వైద్యుల దినోత్సవం” గా జరుపుకుంటున్నాము. కలకత్తాలో వైద్య విద్యాభ్యాసం పూర్తి చేసిన బి.సి. రాయ్, తర్వాత ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లారు. అక్కడ అత్యంత ప్రతిష్టాత్మకమైన M.R.C.P(మెంబర్ అఫ్ రాయల్ కాలేజీ అఫ్ ఫీజిషియన్స్ మరియు F.R.C.S(ఫెలో అఫ్ ది రాయల్ కాలేజ్ అఫ్ సర్జన్స్) డిగ్రీలను కేవలం 2 సంవత్సరాల 3 నెలల వ్యవధిలోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు.
భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఎందరో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించారు. మహాత్మా గాంధీ కి వ్యక్తిగత వైద్యుడిగా కూడా ఆయన సేవలందించారు. గాంధీజీ పిలుపు మేరకు ఆయన స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టింది. రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన తన వైద్య వృత్తిని ఎప్పుడూ వదల్లేదు. ఉదయం పూట పేద రోగులను పరీక్షించి, ఆ తర్వాతే రాజకీయ, పరిపాలనా వ్యవహారాల్లో పాల్గొనేవారు.
పశ్చిమ బెంగాల్ శిల్పి (ముఖ్యమంత్రిగా సేవలు)
1948 నుండి 1962 వరకు (ఆయన మరణించే వరకు) వరుసగా 14 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దేశ విభజన తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో, శరణార్థుల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బెంగాల్ను ఆయన తన మేధస్సుతో నిలబెట్టారు. కలకత్తా పరిసర ప్రాంతాలైన దుర్గాపూర్, కళ్యాణి, బిధాన్ నగర్ (సాల్ట్ లేక్) వంటి ఆధునిక నగరాల స్థాపన వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. అందుకే ఆయన్ను “ఆధునిక పశ్చిమ బెంగాల్ శిల్పి” అని పిలుస్తారు.
అత్యున్నత పురస్కారం – భారతరత్న
దేశానికి ఆయన చేసిన బహుముఖ సేవలను గుర్తిస్తూ, భారత ప్రభుత్వం 1961 ఫిబ్రవరి 4న దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ తో ఆయన్ను సత్కరించింది. “తన కోసం తాను జీవించేవాడు మరణిస్తాడు, ఇతరుల కోసం జీవించేవాడు అమరుడవుతాడు” అనే దానికి డాక్టర్ బి.సి. రాయ్ జీవితమే గొప్ప ఉదాహరణ.
“వైద్యో నారాయణో హరిః” — అంటే వైద్యుడు దేవుడితో సమానం అని మన సంస్కృతి చెబుతుంది. ప్రాణాలు పోసే వైద్యులందరికీ హృదయపూర్వక వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు!
శ్యామ్ కాగిత
మచిలీపట్నం

