బెరాకా మినిస్ట్రీస్ సేవలు అభినందనీయం: డీఈఓ యు.వి. సుబ్బారావు
36 మంది లబ్ధిదారులకు రూ.16.78 లక్షల ఆర్థిక సాయం పంపిణీ
మచిలీపట్నం:
పేదరికం ప్రతిభకు అడ్డంకి కాకూడదనే ఉన్నతాశయంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు, నిరుపేదలకు బెరాకా మినిస్ట్రీస్ అండగా నిలవడం అభినందనీయమని కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) యు.వి. సుబ్బారావు కొనియాడారు. మచిలీపట్నంలోని బెరాకా మినిస్ట్రీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సేవా కార్యక్రమంలో 36 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.16.78 లక్షల విలువైన చెక్కులు, ల్యాప్టాప్లు, నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు.
బెరాకా మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ బి.ఎస్. కిరణ్ పాల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ సహాయంలో భాగంగా విద్యా అవసరాల కోసం రూ.10.37 లక్షలు, గృహ నిర్మాణ అవసరాలకు రూ.5.02 లక్షలు, వైద్య సాయం కింద రూ.1.40 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ సుబ్బారావు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ ప్రచారానికి దూరంగా, బాధ్యతగా సేవ చేయడం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సీనియర్ టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ.. దాదాపు 20 ఏళ్లుగా కిరణ్ పాల్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, వెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు బాబు, చిన్నం శివ, గండికోట అంజిబాబు, బెరాకా మినిస్ట్రీస్ సభ్యులు అడపా గణేష్, సాయి, భార్గవి తదితరులు పాల్గొన్నారు.

