బీచ్ వద్ద మట్టి గణపతి విగ్రహ ఏర్పాట్లు పరిశీలన
మచిలీపట్నం:
మంగినపూడి బీచ్ వద్ద వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న 63 అడుగుల మట్టి గణపతి విగ్రహం, ఇతర ఉపాలయాల నిర్మాణ పనులను శనివారం మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. బీచ్ వద్ద పర్యాటకులతో ముచ్చటిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు.

బీచ్లోని ఫోటోగ్రాఫర్లు, గుర్రపు స్వారీ నిర్వాహకులు, చిరుతిళ్ళ దుకాణ వ్యాపారులతో మాట్లాడి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన గుర్రపు స్వారీ సరదాగా ఆస్వాదించడంతో పాటు, మోటార్ బైక్ రైడ్ చేశారు. మంగినపూడి బీచ్ను మరింత సుందరంగా తీర్చిదిద్ది, పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

