ప్రజాక్షేత్రంలో మంత్రి కొల్లు పర్యటన
ఇంధన పొదుపు- ఎలక్ట్రిక్ సైకిల్పై మంత్రి సవారీ
ప్రజలకు మెరుగైన సదుపాయాల కోసమే పని చేస్తున్నామన్న మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం:
ప్రజలతో కలిసి నడిచినపుడే ప్రజా సమస్యలు తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి నిరూపించారు. ఇంధన పొదుపులో భాగంగా ఎలక్ట్రికల్ సైకిల్పై జగన్నాథపురంలోని ఇంటి నుండి బయల్దేరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తో కలిసి పర్యటించారు. ప్రజలతో మాట్లాడి ఇంధన పొదుపు గురించి వివరించారు. రైతు బజార్, ఆర్టీసీ బస్టాండులో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లో వినియోగదారులు, వ్యాపారులతో మాట్లాడి ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు. కూరగాయలు కొనుగోలుకు వచ్చేవారిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచుల నిషేధంపై అవగాహన కల్పించాలని రైతు బజార్ సిబ్బందికి సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణం నాశనమవుతోందన్నారు.
ఆర్టీసీ బస్టాండు వద్ద ప్రయాణికులతో మాట్లాడారు. ప్రజా రవాణా వినియోగిస్తున్న ప్రయాణికులను అభినందించారు. ఉచిత బస్సు పథకం గురించి మహిళలతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు.స్త్రీ శక్తి పథకం అమలు ప్రభుత్వానికి భారంగా ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు సంతోషంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్టీసీ మన అందరి ఆస్తి అని, దాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆర్టీసీ పరిసరాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అధికారులకు సూచించారు.

