మచిలీపట్నంలో మైనర్ బాలికకు వేధింపులు
మచిలీపట్నం :
మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిజాంపేటకు చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలిక పట్ల వివాహితుడు అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక అద్దెకి ఉంటున్న ఇంటి యజమాని అల్లుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆరోపించారు.
బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, బాలికను పలుమార్లు ఇబ్బందులకు గురిచేస్తూ అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. ఇటీవల జరిగిన ఘటనతో భయాందోళనకు గురైన బాలిక విషయం ఇంట్లో తల్లికి చెప్పడంతో తల్లిదండ్రులు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే విధంగా దర్యాప్తు చేస్తున్నారు.

