నైపుణ్యాలు పెంపొందించే విధంగా ఐటిఐ లను తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం:
జిల్లాలో పరిశ్రమలకు అనుగుణంగా అవసరమైన నైపుణ్యాలు యువతలో పెంపొందించే విధంగా ఐటిఐ లను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో ఐటిఐ, పరిశ్రమల అధికారులు నైపుణ్యాభివృద్ధి అధికారులతో సమావేశం నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సేతు పథకం కింద 200 కోట్ల రూపాయల తో పారిశ్రామిక శిక్షణా సంస్థలను (ఐటిఐ ) పటిష్టపరుచుటకు సంకల్పించిందన్నారు. అందులో 50 శాతం కేంద్ర ప్రభుత్వము, 33% రాష్ట్ర ప్రభుత్వము, మిగిలిన 17 శాతం పరిశ్రమ నెలకొల్పే భాగస్వామి భరించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలకు కావలసిన
నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయుటకు తగిన విధంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం ఉమ్మడి కృష్ణాజిల్లా విజయవాడలో ఆధునికరించిన ఉపాధి శిక్షణ హబ్ను, గుడివాడ నూజివీడు, నిజాంపట్నం లలో క్లస్టర్లను ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 18వ తేదీ లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేయవలసి ఉంటుందన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే క్రమంలో కౌశలం పథకం కింద 60 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో దశలవారీగా 10వేల మంది పరీక్షలు రాశారని, వారిలో 1480 మందికి వివిధ కంపెనీల నుండి ఇంటర్వ్యూకు పిలవడం జరిగిందన్నారు. జిల్లాలో నైపుణ్యం కలిగిన యువతీ యువకులందరికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ స్కిల్ ప్లాన్ కింద 8 డిమాండ్ రంగాలలో ఉపాధి అవకాశాలు లభించే విధంగా యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్ వెంకటరావు, జి ఎస్ డబ్ల్యూ ఎస్ జిల్లా సమన్వయకర్త రవికాంత్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి నరేష్, జిల్లా ఉపాధి కల్పనాధికారి బ్రహ్మం, సీడ్యాప్ ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ కవిత, నాక్ ఏడి పవన్ కుమార్, గుడివాడ ఐటిఐ ప్రిన్సిపాల్ మంజులాదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.

