మచిలీపట్నం :
కృష్ణా జిల్లా పరిధిలోని పెనమలూరులో చోటుచేసుకున్న 10 నెలల బాలుడు కిడ్నాప్ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. కిడ్నాప్కు గురైన బాలుడిని కేవలం 24 గంటల్లోనే సురక్షితంగా రక్షించి తల్లికి అప్పగించామని ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించేందుకు జిల్లా వ్యాప్తంగా నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సమన్వయంతో పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఎస్పీ అన్నారు.
విజయవాడ ఆటోనగర్లోని యూసీ టీ స్టాల్ వద్ద బిక్షాటన చేస్తున్న మాదాసు సుమమ్మను ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు మహిళలు పాత బట్టలు ఇస్తామంటూ నమ్మించి ఆటోలో తీసుకెళ్లారు. అనంతరం కంకిపాడు ఫ్లైఓవర్ సమీపంలో ఆమె వద్ద ఉన్న 10 నెలల బాలుడిని అపహరించారు. ఈ కేసు విచారణలో గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటైన బృందాలు సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఈ కేసులో గంజాల వెంకట శ్రీనివాసరావు, షేక్ రెహనా, కొమిర కాళీలను నిందితులుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డు అందించారు.