ఫ్రైడే-డ్రైడేతో వ్యాధుల నియంత్రణ: మచిలీపట్నం UPHC పరిధిలో విస్తృత సర్వే
మచిలీపట్నం:
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) పరిధిలో శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్రెగూడెం UPHC పరిధిలోని 35వ సచివాలయం, అలాగే 32వ సచివాలయమైన చింతగుండుపాలెం-2 ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బంది విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ‘డోర్-టు-డోర్’ జ్వర సర్వే చేపట్టారు. నిల్వ ఉన్న నీటి గుంటలు, ట్యాంకుల్లో దోమల ఉత్పత్తిని నివారించేందుకు పీడీపీ (PDP) పనులను పూర్తి చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు.
దీంతో పాటు జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLEP) పై ప్రత్యేక దృష్టి సారించారు. కుష్ఠు వ్యాధి లక్షణాలు, వ్యాధిని ముందస్తుగా గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు ఉచిత వైద్య చికిత్స విధానాల గురించి ప్రజలకు స్పష్టంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సిబ్బంది, హెల్త్ సూపర్వైజర్లు రాఘవేంద్రరావు, భట్రాజు సూరిబాబు, హెల్త్ అసిస్టెంట్లు శ్రీనివాసరావు, సూరి ప్రకాష్ రావు, ఏఎన్ఎంలు అనూష, రజిని మరియు ఆశా కార్యకర్త నాగమణి తదితరులు పాల్గొన్నారు.

