దోమల లార్వా నియంత్రణకు గంబూషియా చేపల విడుదల
మచిలీపట్నం:
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దయాకర్, జిల్లా మలేరియా అధికారి అల్లాడ జ్ఞానశ్రీ ఉత్తర్వుల మేరకు రైలుపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) పరిధిలోని 12వ సచివాలయ పరిధిలోని రైలుపేట ప్రాంతంలో గురువారం దోమల లార్వా నియంత్రణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా స్థానిక నీటి నిల్వల్లో గంబూషియా (Gambusia) చేపలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ… నిల్వ నీటిలో దోమల లార్వాను ఈ చేపలు తినివేయడం ద్వారా దోమల ఉత్పత్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ భట్రాజు సూరిబాబు, హెల్త్ అసిస్టెంట్ మేడూరి చంద్రమోహన్, స్థానిక ఏఎన్ఎమ్లు, ఆశా కార్యకర్తలు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

