38 కోట్ల వ్యయం తో పంట కాలువల మరమత్తు పనులు మంజూరు
మచిలీపట్నం:
జిల్లాలో 38 కోట్ల రూపాయల వ్యయంతో 825 పంట కాలువల మరమ్మతుల పనులు మంజూరు చేశామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ బందరు, పెడన, బంటుమిల్లి మండలాల్లో పర్యటించి రామరాజు పాలెం పంట కాలువ, బంటుమిల్లి ప్రధాన పంట కాలువ లలో జరుగుతున్న పూడికతీత పనులను, గుర్రపు డెక్క తొలగింపు పనులను రసాయన పిచికారి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో పంట కాలవల్లో పూడికతీత, గుర్రపు డెక్క తొలగించుటకు 825 పనులకు గాను 38 కోట్ల రూపాయలను మంజూరు చేశామన్నారు. ఈ పనులను సత్వరమే పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించామన్నారు. త్వరలో పంట కాలువలకు సాగునీరు విడుదల చేయనున్నామన్నారు. ఆలోగా రైతులందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే వంటకాలవలలోని పూడిక తీసివేయడం, గుర్రపు డెక్కను తొలగించడం పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పంట కాలువల్లో ఎలాంటి అవరోధాలు లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామన్నారు. సాగునీటి సంఘాలలోని రైతుల భాగస్వామ్యంతో చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ మేలు జరిగే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఎస్ ఇ జలవనరుల శాఖ ఎస్ ఇ గుణకరరావు , కెసి డివిజన్ ఈఈ రవికిరణ్ , కే ఈ డివిజన్ ఈఈ ఆంజనేయ ప్రసాద్, బందరు డి ఈఈ అపర్ణ , ఏ ఈ ఈ లు, డి.సి సాగునీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.

