ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్ ముఠాపై పోలీసులు ఆకస్మిక దాడి
రూ.36 వేల నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలు స్వాధీనం – నలుగురు అరెస్ట్
మచిలీపట్నం :
కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ పోలీసులు వరుస చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చంటి సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న రాత్రి 9 గంటల సమయంలో మచిలీపట్నం ఈడేపల్లి ప్రాంతంలోని డోర్ నంబర్ 145, ఎస్ కన్వెన్షన్ ఎదుట ఉన్న జంగాల జువెలర్స్ పాత ఇంటిలో ఐపీఎల్ మ్యాచ్లపై మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో 4 గురు నిందితులతో పాటు మరో 25 మందితో కలిసి సామూహికంగా ఆన్లైన్ జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సంఘటనా స్థలంలోనే నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.36,865/- నగదు, 8 సెల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలలో AP40EJ3379 అథర్ స్కూటర్, AP39SW8743 సుజుకి యాక్సెస్, AP07AD4891 హీరో హోండా ప్యాషన్ ప్రో వాహనాలు ఉన్నాయి అని తెలిపారు.
ఈ ఘటనపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఐపీఎల్ మ్యాచ్ల పేరుతో జరుగుతున్న అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, జూద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. యువత, ప్రజలు ఇలాంటి అక్రమాలకు దూరంగా ఉండాలని, ఆన్లైన్ బెట్టింగ్ లేదా జూద కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

