రైతు బజార్ ఆవరణలో ప్లాస్టిక్ పై అవగాహన సదస్సు నిర్వహించిన జాయింట్ కలెక్టర్
ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణరావు
మచిలీపట్నం:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర ‘ కార్యక్రమంలో భాగంగా, మచిలీపట్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైతుబజార్ ఆవరణలో మన లక్ష్యం – ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ అనే ఇతివృత్తంతో శనివారం జరిగిన బహిరంగ సభకు నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ , ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కె నారాయణ , మున్సిపల్ కమిషనర్ చోడే వీర వెంకట సత్య బాపిరాజు , అసిస్టెంట్ కమిషనర్ ఎం. గోపాల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభను ఉద్దేశించి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల భవిష్యత్ తరాలకు కలిగే తీవ్ర అనర్థాలను తెలిపారు. పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ‘ప్లాస్టిక్ భూతాన్ని’ తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. జ్యూట్ సంచులే ప్రత్యామ్నాయం అని అన్నారు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ పౌరులంతా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు స్వస్తి పలికి, వాటి స్థానంలో బట్ట సంచులను మాత్రమే వినియోగించాలని పిలుపునిచ్చారు.
‘ప్లాస్టిక్ ఫ్రీ మచిలీపట్నం’ సాధనలో నగరంలోని వ్యాపారస్తులంతా నగరపాలక సంస్థకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. పచ్చదనం – పరిశుభ్రత పై మున్సిపల్ కమిషనర్ చోడే వీర వెంకట సత్య బాపిరాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు. ప్లాస్టిక్ నిషేధంతో పాటు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి నగరంలో పచ్చదనాన్ని పెంపొందించాలని విజ్ఞప్తి చేశారు. సభా కార్యక్రమం అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు స్వయంగా రైతుబజార్ పరిసరాలను శుభ్రపరిచి ఆదర్శంగా నిలిచారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో పర్యావరణ పరిరక్షణపై స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ’ చేయించారు.
ఈ కార్యక్రమంలో నగర పౌరులతో పాటు కలెక్టరేట్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

