MachilipatnamLocal News
April 14, 2026
కృష్ణా జిల్లా

మీకోసం అర్జీల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి –– జిల్లా రెవెన్యూ అధికారి

  • February 16, 2026
  • 0 min read
[addtoany]
మీకోసం అర్జీల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి –– జిల్లా రెవెన్యూ అధికారి
మచిలీపట్నం :
 
ప్రజల నుంచి అందే మీకోసం అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.
 
సోమవారం ఉదయం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించారు. కే ఆర్ ఆర్ సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఇనకుదురు పేట సీఐ ఎస్ పరమేశ్వర్ తో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. 
 
కార్యక్రమం అనంతరం డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 3 వేలకు పైగా నిష్క్రియ బ్యాంకు ఖాతాలు (ఇనోపరేటివ్ బ్యాంక్ అకౌంట్స్) ఉన్నాయని, ఆయా శాఖల అధికారులు తక్షణం బ్యాంకులను సంప్రదించి ఈకేవైసీలు సమర్పించి అప్డేట్ చేసుకోవాలని సూచించారు.
 
ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేందుకు, రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచికలతో ఎంప్లాయి పర్ఫామెన్స్ ట్రాకింగ్ సిస్టం (ఈ పి టి ఎస్) అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకురానున్నదని, దీనిపై జిల్లా అధికారులు తమ సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. ఐ గాట్ కర్మయోగి ఆన్లైన్ కోర్సులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, దీనిపై ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పూర్తి చేయించే విధంగా తమ సిబ్బందికి సూచించాలని చెప్పారు.
 
ఈ నెల మూడవ శుక్రవారం కలెక్టరేట్లో ఉద్యోగుల గ్రీవెన్స్ డే నిర్వహించనున్నామని, ఉద్యోగులు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలని సూచించారు.
 
అర్జీలలో కొన్ని: 
 
పరిశీలన చేసి దివ్యాంగులకు కొత్తగా జారీ చేస్తున్న సదరం ధ్రువీకరణ పత్రాలు చాలామందికి అందలేదని, దీనివల్ల ఉద్యోగాలు, రైల్వే పాసులు, ఇతర సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని, రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన దివ్యాంగులందరికీ సకాలంలో సదరం ధ్రువీకరణ పత్రాలు అందించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కమిటీ తరఫున సత్యనారాయణ, శివశంకర్ తదితరులు అర్జీ సమర్పించారు. 
 
కొంతమంది అక్రమార్కులు ఇతర ప్రాంతాల నుండి యానాదులను అక్రమంగా తీసుకువచ్చి నాగాయలంక ఇలచేట్ల దెబ్బలో వారిని బంధించి భయభ్రాంతులకు గురిచేసి వారి చేత వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని, అనేక సంవత్సరాలుగా వారిని బానిసలుగా చేసుకున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు అర్జీ ద్వారా విన్నవించారు.
 
కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరరావు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారిణిలు ఎన్ పద్మావతి, జే జ్యోతి, జిల్లా పౌర సరఫరాల అధికారి జి మోహన్ రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, మార్క్ ఫెడ్ డీఎం మురళీ కిషోర్, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి సోమశేఖర్, పశుసంవర్ధక శాఖ అధికారి చిన నరసింహులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *