మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి… ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు
మచిలీపట్నం:
భారతదేశ స్వాతంత్య్రం కోసం విరోచితంగా పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటపటిమను స్పూర్తిగా తీసుకొని నేటి యువత సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి నీ పురస్కరించుకొని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీతారామరాజు భారత స్వాతంత్ర చరిత్ర లో ఒక మహోజ్వల శక్తి , బ్రిటిష్ వారి గుండెల్లో సింహస్వప్నంగా నిలిచిన విప్లవ జ్యోతి అని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించాడని, అతడి దేశభక్తి స్ఫూర్తి, భారతీయ జాతీయవాదం జ్వాలలను రేకెత్తించిందని, దేశంలో బ్రిటిష్ పాలకుల దోపిడీ, దురాగతాలు, దమనకాండలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టేందుకు అనేకమందిని ప్రేరేపించిందని గుర్తుచేశారు. సీతారామరాజు సాగించిన సాయుధ పోరాటం తెలుగు జాతి చరిత్రలో గొప్ప ఘట్టంగా చిరస్థాయిగా నిలిచి ఉంటుందని, తెలుగు జాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆయన త్యాగశీలిని, పోరాటపటిమను నేటి యువత స్పూర్తిగా తీసుకొని సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. అనంతరం పోలీస్ అధికారులకు సిబ్బందికి మిఠాయిలు పంచారు.

