మచిలీపట్నం :
నగరంలో బుధవారం పర్యటించిన రాష్ట్ర భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి పరిశీలించిన మంత్రి, మీడియాతో మాట్లాడారు.
గత ఐదు సంవత్సరాల పరిపాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని ఆయన ఆరోపించారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం, ఆత్మస్థైర్యం కలిగించేందుకు ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిందని తెలిపారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ఇప్పుడు రాజధాని చట్టంపై ప్రశ్నించడం తగదని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే చట్టాన్ని మార్చేస్తా అన్న వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని కలిగిస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొనసాగుతాయని, పెట్టుబడిదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
అంతేకాకుండా, జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం ఆయన కల మాత్రమేనని వ్యాఖ్యానించారు.