మంగినపూడి విజయగణపతి మహోత్సవానికి రేపు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక
మచిలీపట్నం:
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సాగర తీరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ‘సాగరతీర మహాగణపతి మహోత్సవానికి’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ఈ మేరకు రాజ్భవన్ కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
గవర్నర్ అబ్దుల్ నజీర్ సెప్టెంబర్ 15 (మంగళవారం) సాయంత్రం రోడ్డు మార్గంలో బయలుదేరి, 5:30 గంటలకు మంగినపూడి బీచ్లోని ఉత్సవ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడే ప్రతిష్ఠించిన 63 అడుగుల భారీ మట్టి విజయగణపతిని దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రాష్ట్ర గవర్నర్ రాకను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం మరియు ఉత్సవ కమిటీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. విఐపిల పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు, శాంతిభద్రతల పర్యవేక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

