అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
మచిలీపట్నం:
నగరంలో గంజాయి విక్రయాలు, కళ్యాణ మండపాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశంలో వెల్లడించారు.
అరెస్టైన నిందితులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనికేష్ కుమార్ సాన్సీ (20), రితేష్ (20)గా గుర్తించారు. వీరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కళ్యాణ మండపాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడటంతో పాటు గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 52.8 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.3.10 లక్షల నగదు, 3.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఫేషియల్ రికగ్నిషన్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించి రివార్డులు అందించారు.
జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని, గంజాయి విక్రయాలు, చోరీలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని ఎస్పీ స్పష్టం చేశారు.

