కృష్ణా యూనివర్సిటీలో ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పర్యటన
మచిలీపట్నం:
కృష్ణా విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నార్సింగ్ శైలాని శనివారం నాడు ప్రత్యేకంగా సందర్శించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు కాకినాడ బెటాలియన్ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్, 16 ఏపీ కమాండర్ కల్నల్ చందన్ ఠాకూర్, కల్నల్ అనిల్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ (ఉపకులపతి) ఆచార్య కే. రాంజీ మాట్లాడుతూ… నాయకత్వం అనేది కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆచరణ ద్వారా యువతను ప్రేరేపించాలని ఆకాంక్షించారు. డీడీజీ శైలాని రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్సీసీ క్యాడెట్లతో నేరుగా సమావేశాలు నిర్వహించడం, శిక్షణా శిబిరాలను సందర్శించడం యువతను సరైన మార్గంలో నడిపించడంలో ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. అనంతరం అతిథులను వర్సిటీ తరఫున ఘనంగా సత్కరించారు.
సత్కారం అందుకున్న అనంతరం డీడీజీ నార్సింగ్ శైలాని మాట్లాడుతూ… కృష్ణా యూనివర్సిటీ ఎన్సీసీ క్యాడెట్లను ప్రత్యక్షంగా కలవడం ఎంతో గౌరవంగా, సంతోషంగా ఉందన్నారు. వర్సిటీ యంత్రాంగం అందించిన ఆతిథ్యానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ డి. రామశేఖర్ రెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. బాబురెడ్డితో పాటు పలువురు అధ్యాపకులు, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

