హర్ష కాలేజ్ సమీపంలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు
మచిలీపట్నం:
మచిలీపట్నం – గుడివాడ రహదారిపై హర్ష కాలేజ్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. పెడన నుంచి మచిలీపట్నం వైపు వస్తున్న ఓ కారు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఒకరికి చేతికి, మరొకరికి కాలికి గాయాలు కాగా, కారు ఢీకొట్టిన వేగానికి ఆటో ముందుకు దూసుకెళ్లి అదే మార్గంలో వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు కూడా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు.
ఈ ఘటనతో మచిలీపట్నం–పెడన ప్రధాన రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

