డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష
మచిలీపట్నం:
నగరంలో నిర్మించ తలపెట్టిన ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజి శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రాజెక్టులో భాగంగా డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహం, ఆధునిక సదుపాయాలతో కూడిన ఆడిటోరియం, వైజ్ఞానిక ప్రదర్శనశాల, డిజిటల్ గ్రంథాలయం, విద్యా, ఆరోగ్య, సాంస్కృతిక విభాగాలు, అలాగే యూనియన్ బ్యాంకు పరిపాలన భవనం నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా అధికారులు రూపొందించిన ఆడిటోరియం నిర్మాణ నమూనా (మ్యాప్)ను కలెక్టర్ పరిశీలించారు. ఆడిటోరియం నిర్మాణ వ్యయం, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, టెండర్ల ప్రక్రియ, నిర్మాణ పనుల అమలు విధానాలపై అధికారులతో చర్చించారు. మొదటి దశలో చేపట్టవలసిన నిర్మాణాలకు సంబంధించి పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన సమర్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ఇంచార్జ్ డిఆర్ఓ పి పోతురాజు, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ జోగారావు, ఎన్బీసీసీ జనరల్ మేనేజర్ వెంకబొన్న, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణరావు, ఆర్కిటెక్చర్ వినీత్, యూనియన్ బ్యాంక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

