[addtoany]
మచిలీపట్నం:
విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత, పొద్దున్నే నిద్ర లేవడం, చదువుకోవడం వంటి మంచి అలవాట్లు నేర్చుకుంటే వారి జీవితాల్లో బంగారు భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్భోదించారు.
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం పెడన నియోజకవర్గంలోని పెడన మండలం బల్లిపర్రు గ్రామంలోని గురుకుల పాఠశాలలో 42 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి పాఠశాలలో కాంపోస్టు గుంతను కలెక్టర్ శాసనసభ్యులు త్రవ్వారు. స్వయం సహాయక సంఘాల మహిళలు గుర్రపుడెక్కతో తయారుచేసిన చాపలు, బుట్టలు వివిధ రకాల వస్తువులను, కాంపోస్ట్ ఎరువుతో పండించిన వివిధ రకాల కూరగాయలను వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ నిర్మించి ఇచ్చామని, దాన్ని నిర్మించడం చాలా సులభం అని పరిశుభ్రంగా నిర్వహించుకోవలసిన బాధ్యత విద్యార్థులు అందరిపైనా ఉందన్నారు
తాను ఒక నెల తర్వాత మరల పాఠశాలకు వస్తానని అప్పుడు కూడా ఇప్పుడున్న విధంగానే పరిశుభ్రంగా నిర్వహించుకున్నారా లేదా గమనిస్తానన్నారు.
అలాగే మనం ఉంటున్న పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా చెత్త ఉండకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్త ఎక్కడ కనపడిన చెత్తబుట్టలో వేయాలన్నారు. ఇప్పటినుంచి నేర్చుకున్న మంచి అలవాటులే వారి జీవితాలను మార్చేస్తుందన్నారు
రోజు పొద్దున్నే నిద్రలేస్తున్నారా లేదా చదువుకుంటున్నారా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పొద్దున్నే నిద్ర లేచి యోగ కూడా చేస్తున్నామని విద్యార్థులు చెప్పగా వెంటనే జిల్లా కలెక్టర్ స్పందిస్తూ యోగ వలన మనసు అప్రమత్తమవుతుందని ఆ సమయంలో చదువుకోవాలని ముఖ్యంగా ఆరోజు పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను ముందుగానే చదువుకొని వెళ్లాలని, ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలని, తర్వాత ఇంటికి వచ్చాక మరల ఆ పాఠాన్ని చదువుకుంటే బాగా అర్థమవుతుందన్నారు. ఆ విధంగా చేయడం వలన క్రమం తప్పకుండా పాటించడం వలన మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. అందరూ బాగా చదవడంతోపాటు సానిటరీ కాంప్లెక్స్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉద్బోధించారు.
పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ మాల్స్ లో ఉండే విధంగా ఇక్కడి కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ నిర్మించడం చాలా సంతోషదాయకం అన్నారు. ఆ కాంప్లెక్స్ ను చాలా జాగ్రత్తగా నిర్వహించుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. వేసవికాలంలో ఎండలు బాగా ఉంటున్నాయని భూమి తాపాన్ని తగ్గించడానికి మొక్కలు విరివిగా నాటి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవాలని భూమిలో కలవలేని వస్తువులను ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్త వేరు పరచాలన్నారు. ప్లాస్టిక్ వంటి వ్యర్థ పదార్థాలతో వివిధ రకాల దండలు, చాపలు వంటి వస్తువులను తయారు చేయడం గొప్ప విషయం అన్నారు.
కలెక్టర్ ఏ కార్యక్రమం అయినా పట్టుకుంటే అది దిగ్విజయంగా పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టరన్నారు.
వంటకాలువల్లో వృధాగా పెరుగుతున్న గుర్రపు డెక్కతో ఎన్నో రకాల వస్తువులు తయారు చేయవచ్చని, వాటికి మంచి డిమాండ్ కూడా ఉందని కలెక్టర్ నిరూపించారన్నారు. నియోజకవర్గంలోని మల్లేశ్వరం, చేవేండ్రలలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళల చేత వివిధ రకాల వస్తువులు చేయించడం తనకు గర్వకారణంగా ఉందన్నారు
అంతేకాకుండా ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కరించడం నూటికి నూరు శాతం పరిష్కరించడం జరుగుతుందన్నారు. సమస్యల పరిష్కారంలో గాని, జిల్లా అభివృద్ధిలో గాని కలెక్టర్ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డ్వామా పీడీ శివప్రసాద్, జడ్పీ సీఈవో డాక్టర్ జే అరుణ, తదితర అధికారులు అనధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

