మచిలీపట్నం :
కేంద్ర ప్రభుత్వం 2027 జనాభా గణనను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని అందులో ఈసారి కొత్తగా ప్రజలకు స్వీయ గణన చేసుకునే అవకాశం ఏప్రిల్ 16 తేదీ నుండి 30 వ తేదీ వరకు కల్పించబడిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు.
బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో 2027 జనాభా గణాన పై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జన గణన రెండు దశలలో నిర్వహించబడుతుందని మొదటి దశలో ఇండ్ల జాబితా, ఇండ్ల గణన రెండవ దశలో జనాభా గణన నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈసారి మొట్టమొదటగా డిజిటల్ సాధనాల ద్వారా డేటా సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
ఎన్యూమరేటర్లు తమ సొంత స్మార్ట్ ఫోన్లో ప్రత్యేక మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించి కుటుంబాల వివరాలను సేకరిస్తారన్నారు. ప్రజలు స్వీయ గణన ద్వారా సమర్పించిన సమాచారాన్ని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ధ్రువీకరిస్తారన్నారు.
ఇండ్ల జాబితా ఇండ్ల గణనకు సంబంధించి ప్రాథమిక ఏర్పాటు కొనసాగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డ్ ట్రైనర్ల ఎంపిక చేసి వారికి తగిన శిక్షణ ఇవ్వబడిందన్నారు. మండలాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఎన్యుమరేషన్ బ్లాక్ లను గుర్తించామన్నారు. వాటికి అనుగుణంగా ఎన్యూమరేటరులను సూపర్వైజర్లను నియమించామన్నారు.
వారికి ఈనెల 9 తేదీ నుండి ఈ నెలాఖరు వరకు నాలుగు బ్యాచులుగా ఫీల్డ్ ట్రైనర్లచే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదన్నారు. మే 1 వ తేదీ నుండి 31వ తేదీ వరకు మొదటి దశ ఇండ్ల జాబితా, ఇండ్ల గణన ఎంపిక చేయబడిన ఎన్యూమరేటర్లు సూపర్వైజర్ల ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలు స్వీయ గణన చేసుకునేందుకు ఆన్లైన్ పోర్టల్ https://se.census.gov.in లో వివరాలు నమోదు చేస్తే ఐడి జనరేట్ అవుతుందన్నారు.
జనగనన ముఖ్యమైన జాతీయ కార్యక్రమం అయినందున ప్రజలందరూ సహకరించి సరైన సమాచారాన్ని అందించాలని కోరారు. ఈ పాత్రికేయుల సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు పాల్గొన్నారు.