జిల్లాలో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించుటకు ప్రజలను చైతన్య పరచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని రేవతి సెంటర్ వద్ద గల అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించి ఈ నెల 14 నుండి 20 వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అగ్ని ప్రమాదాల నివారణ పై ప్రజలను చైతన్య పరిచే కరపత్రాలను, గోడపత్రాలను విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలను నివారించుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ఆపద సమయాలలో ప్రజల ప్రాణాలను రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర ఎంతో కీలకమన్నారు. తొలుత అగ్నిమాపక కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించే పలు పరికరాలు జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం, ఏడి ఎఫ్ ఓ ఆనం రమణారెడ్డి, లీడింగ్ ఫైర్ మాన్లు వెంకటేశ్వరరావు, జకరయ్య తదితర అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.