మచిలీపట్నం :
జిల్లాలోని పౌరులందరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.
జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం నగరంలోని కలెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలో సర్వే భూ రికార్డుల సర్వే కార్యాలయ ముంగిట జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ తో కలసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
అనంతరం వారు రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. పలువురు సర్వే సిబ్బంది కూడా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జాతీయ సర్వే దినోత్సవం పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకుని సర్వేయర్లందరూ రక్తదానంలో పాల్గొనడం గొప్ప విషయం అన్నారు.
రక్తదానం చేయడం చాలా ముఖ్యమైన మంచి కార్యక్రమమన్నారు.
ఆసుపత్రులలో పరిశీలిస్తే ప్రతిరోజు ఏదో రకమైన ప్రమాదాలతో వచ్చే రోగులకు గాని , వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో రక్తహీనత ఉండే రోగులకు గాని రక్తం చాలా అవసరం ఉంటుందన్నారు.
సర్వే శాఖ వారు ఇటువంటి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
జిల్లాలోని పౌరులందరూ రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి ఆపదలో ఉన్న వారిని కాపాడాలన్నారు.
ఇతరత్రా ఖాళీగా ఉన్న సమయాల్లో కూడా నగరంలోని ఐ ఆర్ సి ఎస్ వద్ద వీలైనంత ఎక్కువగా రక్తదానం చేయాలని చాలామంది ప్రాణాల్ని కాపాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్వే రికార్డుల శాఖ ఏడి లక్ష్మణరావు గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ సిరివి శెట్టి భాస్కర్, డాక్టర్ డి హనుమంతయ్య, కోశాధికారి కుమార్, జిల్లా సమన్వయకర్త హరికృష్ణ, పలువురు సర్వేయర్లు, సర్వే శాఖ సిబ్బంది, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.