[addtoany]
– అవినీతి పోలీసులను ప్రశ్నిస్తూనే ఉంటాం
: కృష్ణాజిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, పెనమలూరు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వకర్తలు చక్రవర్తి, ఉప్పాల రమేష్ (రాము), పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
మచిలీపట్నం:
అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి ప్రజలను ఇబ్బంది పెడుతున్న పోలీసులను నిలదీస్తూనే ఉంటామని, అక్రమ కేసులతో మా పోరాటాన్ని ఆపలేరని వైయస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) పట్ల అనుచితంగా వ్యవహరించిన సీఐ పై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మచిలీపట్నంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, పెనమలూరు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వకర్తలు చక్రవర్తి, ఉప్పాల రమేష్ (రాము), పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) పాల్గొన్నారు. పోలీసు హక్కుల సంఘం నాయకుడిగా జైపాల్ మాకు నీతులు చెప్పి, ఆయన నీతి తప్పితే ఎలా అని పేర్ని నాని ప్రశ్నించారు. రెచ్చగోట్టేలా అనుచితంగా మాట్లాడిన సీఐ విషయంలో ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. పోలీసులే అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ప్రజలను వేధించడం సిగ్గుచేటని మండిపడ్డారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఇళ్ల కూల్చివేతలకు బందోబస్తుగా వచ్చిన పోలీసులు, రిక్విజిషన్ లెటర్లు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని వైయస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. కొంతమంది అలాంటి అవినీతి పోలీసుల కారణంగా పోలీస్ వ్యవస్థ ప్రజల్లో చులకన అయ్యిందని వివరించారు.
వారు ఇంకా ఏమన్నారంటే…
● కూల్చేసిన ఇళ్లకు రిక్విజిషన్ లెటర్లు చూపించండి
– పేర్ని వెంకట్రామయ్య(నాని), మాజీ మంత్రి
పోలీసు హక్కుల సంఘం నాయకుడిగా జైపాల్ మాకు నీతులు చెప్పి, ఆయన నీతి తప్పితే ఎలా? వైయస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పేర్ని కిట్టును ఉద్దేశించి సీఐ మాట్లాడిన మాటలను ఎలా సమర్థించుకుంటాడో చెప్పాలి. మీ గవర్నమెంట్లో ఇళ్లు కొట్టేశారని సీఐ మాట్లాడటం తప్పు కాదా? ఆయన ఇక్కడుండి చూశాడా? పోలీస్ అధికారిగా ఉంటూ రాజకీయ నాయకుడిగా మాట్లాడటం ఏమిటి? ఉద్దేశపూర్వకంగా కవ్వింపు చర్యలకు దిగిందిగాక దాన్ని సమర్థించుకుంటూ ప్రెస్మీట్ పెట్టడం సిగ్గుచేటు. మంత్రి కొల్లు రవీంద్ర ఎన్నోసార్లు పోలీస్ అధికారులను తిడితే ఈ జైపాల్ ఎందుకు ఖండించలేదు? తెలుగుదేశం పార్టీ నాయకుల దోపిడీలు, దురాగతాల నుంచి కాపాడటమే నా పని. ఇది మీకెందుకు గిట్టడం లేదో అర్థంకావడం లేదు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైలుకే పంపినా వైయస్సార్సీపీ నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటా. ఈ పోరాటం ఆపే ప్రసక్తే ఉండదు. దుర్మార్గాలకు వంతపాడుతున్న కొంతమంది పోలీసులను హెచ్చరిస్తుంటే జైపాల్ గారు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో. కోరినట్టుగా పోస్టింగులు రావని అంటున్న జైపాల్ గారు, కూటమి ప్రభుత్వం వచ్చాక పామర్రులో జాయిన్ అయిన వెంటనే ట్రాన్సఫర్ అయిన సీఐ గురించి తెలియదా? కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల లెటర్లు లేకుండా పోస్టింగ్లు ఇవ్వడం లేదన్నది బహిరంగ సత్యం. ఆయన కాదని చెప్పగలరా? టీడీపీ నాయకులకు తొత్తులుగా మారి తప్పులు చేస్తున్న పోలీసులనే హెచ్చరించాను తప్ప, నిజాయితీ గల అధికారులను గౌరవిస్తూనే ఉన్నా. పోలీసులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నా చూస్తూ కూర్చోవాలా? పోలీసు బందోబస్తు కావాలని మున్సిపల్ శాఖ అభ్యర్థిస్తూ రాసిన రిక్విజిషన్ కాపీ మీద ఉన్న కమిషనర్ సంతకం చూస్తే నిజమా కాదా అనే అనుమానం కలుగుతోంది. కుమ్మరిగూడెంలో తెల్లవారుజామును కూల్చేసిన రెండు వందల ఇళ్లను, బందరులో 600 బడ్డీ కొట్లు పోలీస్ బందోబస్తుతో నేలమట్టం చేశారు. వాటికి సంబంధించిన రిక్విజిషన్ కాపీ ఉంటే చూపించాలి. హత్యాయత్నం అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియకి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పటివరకు ఎందుకు రిలీజ్ చేయలేదు? పోలీసులు తప్పు చేయనప్పుడు స్టేషన్ ఫుటేజ్ ఇవ్వడానికి ఎందుకు భయం? అవినీతి పోలీసుల కారణంగా పోలీస్ వ్యవస్థ గౌరవం కోల్పోతుంది.
● బరితెగిస్తున్న సీఐపై చర్యలు తీసుకోవాలి
– కైలే అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. రాజకీయంగా తమతో విభేదించే వారి మీద దాడులు చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రతిఘటిస్తే ప్రాణాలు తీయడం సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ప్రభుత్వ వైఫల్యాలను వ్యతిరేకించే వారిని, కూటమి నాయకుల తప్పులను ప్రశ్నించే వారిని ప్రశాంతంగా బతనీయడం లేదు. మచిలీపట్నంలో అక్రమంగా ఇంటిని కూల్చివేస్తుంటే మా నాయకుడు పేర్ని కృష్ణమూర్తి బాధితులకు అండగా నిలబడి అడ్డుకున్నారు. బాధితులను పరామర్శిస్తుంటే భారీ ఎత్తున పోలీసులను అక్కడికి పంపించి భయానక వాతావరణం సృష్టించారు. అన్యాయంగా ఇళ్లను కూల్చడం తప్పని ప్రశ్నించినందుకు సీఐ పరమేశ్వరరావు కలగజేసుకోవడమే కాకుండా మీ ప్రభుత్వంలో కూడా ఇలాగే జరిగింది అంటూ రాజకీయ నాయకుడిగా మాట్లాడటం హేయం. అంతేకాకుండా పీక్కోండి అంటూ అసభ్యంగా మాట్లాడటం సిగ్గుచేటు. ఇదే పరమేశ్వరరావు వైయస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా కంకిపాడులో ఎస్సైగా పనిచేసేవాడు. గ్రామాల్లో పేకాట శిబిరాలను ప్రోత్సహిస్తున్నాడనే కారణంతో ఆయన్ను గత ప్రభుత్వంలో సస్పెండ్ కూడా చేయడం జరిగింది. కూటమి నాయకుల అడుగులకు మడుగులొత్తే కొంతమంది పోలీసుల మాటలు నమ్మి, వాస్తవాలను తెలుసుకోకుండా ఎస్పీ ప్రెస్నోట్ లు రిలీజ్ చేయడం శోఛనీయం. పీక్కోండి అన్న సీఐ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి. చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోకపోగా కనీసం వారిని అదుపులో పెట్టడం లేదు. పోలీసులే టీడీపీ నాయకుల మాదిరిగా వ్యవహరిస్తున్న తీరుకు సిగ్గుపడాలి.
● సీఐని తక్షణం సస్పెండ్ చేయాలి
– సింహాద్రి రమేష్, మాజీ ఎమ్మెల్యే
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. సీఐ మాట్లాడిన దిగజారుడు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి ఎస్పీ సమర్థించేలా వ్యవహరిస్తున్నారు. పోలీసులతో ప్రెస్మీట్ పెట్టించి అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సంఘటన స్థలంలో ఉన్నవారితోపాటు వీడియోలు చూసినవారంతా సీఐ దిగజారుడు ప్రవర్తనపై మండిపడుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయకుడి పట్ల సీఐ వ్యవహరించిన తీరు మరీ వివాదాస్పదంగా ఉంది. పీక్కోండి అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడిన సీఐని తక్షణం సస్పెండ్ చేయాలి.
● పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారు
– ఉప్పాల రమేష్ (రాము), పెడన నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వకర్త
జనసేన నాయకుడి ఇంటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులను అడ్డం పెట్టి మున్సిపల్ అధికారులు కూల్చివేస్తుంటే మా నాయకుడు పేర్ని కిట్టు ప్రతిఘటించారు. చట్టప్రకారం వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆ సందర్భంగా సీఐ వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉంది. పోలీసు వ్యవస్థ గౌరవానికే మచ్చ తెచ్చేలా ఉంది. ఇదంతా వీడియోల సాక్షిగా క్లియగ్ కనిపిస్తోంది. అయినా ఇలాంటి వ్యక్తిని ఎస్పీ సస్పెండ్ చేయాల్సిందిపోయి వెనకేసుకురావడం దారుణం. పోలీసులే రాజకీయ నాయకులుగా, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సిగ్గుచేటు.
● ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే కుట్ర
– చక్రవర్తి, పెనమలూరు నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వకర్త
ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై నిలదీస్తుంటే ఈ ప్రభుత్వం ఓర్చుకోలేకపోతోంది. నియమనిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ప్రశ్నించినందుకు మా పార్టీ నాయకుడు పేర్ని కిట్టుపై అసభ్య పదజాలంతో సీఐ రెచ్చిపోయాడు. పోలీసులే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా వ్యవహరించారు. ఆయన్ను తక్షణం సస్పెండ్ చేయాలి. చేసిన అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి
మా నాయకులపై అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదు.

