మచిలీపట్నం :
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుతూ ఆ అవార్డుకు అడ్డంకులు తొలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మాల ధారణతో కూడిన పాదయాత్రను కృష్ణాజిల్లా నిమ్మకూరు నుంచి సత్యసాయి జిల్లా ధర్మవరం టౌనుకు చెందిన బి ఎల్ నరసింహులు ప్రారంభించి జిల్లా మొత్తం పర్యటించి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని 41 రోజులపాటు ఈ పాదయాత్ర చేసుకుని మరల ఎన్టీఆర్ సొంత గ్రామమైన నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాల వద్ద ఈ దీక్షను విరమించడం జరుగుతుందని బిఎల్ నరసింహులు తెలిపారు.
బి ఎల్ నరసింహులు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న పాదయాత్ర 12వ రోజు అయిన గురువారం మచిలీపట్నం విచ్చేసిన సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు లోగిశెట్టి స్వామి ఆధ్వర్యంలో ఆయనకు అభినందనలు తెలిపి పాదయాత్ర విజయవంతం అవ్వాలని పాదయాత్ర చేస్తున్న బిఎల్ నరసింహులను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించి, బిఎల్ నరసింహులు పాదయాత్రకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ అన్నారు. బి ఎల్ నరసింహులు పాదయాత్రకు మచిలీపట్నం నగర తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నాము అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పి. వి. ఫణి కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎండి ఇలియాస్ పాషా, అడపా రత్నాకర్, కొల్లు రంగ, వి. వెంకటేశ్వరరావు, వనం రెడ్డి ప్రసాద్, కోమటి శ్రీనివాస్, కే. వెంకటేశ్వరరావు, కే .ఎర్రబాబు, టి .రాజ్యలక్ష్మి, అంకం లక్ష్మి, అబ్దుల్ అజీమ్, షేక్ ఫిరోజ్, తోట మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.